కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) ధ్వజమెత్తారు. డీఎస్సీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రశ్నపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఒకే వ్యక్తికి అప్పగించడాన్ని ఆయన తప్పుపట్టారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడారు.
ప్రశ్నపత్రాల తయారీ విభాగంలో పనిచేసిన నవీన్ అనే వ్యక్తికి డీఎస్సీలో మొదటి ర్యాంక్ రావడంపై జగన్ అనుమానాలు వ్యక్తం చేశారు. తొలి మెరిట్ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న నవీన్కు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సర్టిఫికెట్ల పరిశీలన జాబితా నుంచి నవీన్ పేరును తొలగించారాని, వాస్తవాలు ఇలా ఉంటే అతను న్యాయస్థానాన్ని ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చిందని జగన్ నిలదీశారు. రెండో వెరిఫికేషన్ జాబితాలోనూ అతని పేరు తీసివేయడంతో అసలు అతను పరిశీలనకు ఎలా రాగలడని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తీరును విమర్శించారు.
అలాగే స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కనీసం డీఎస్సీ పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండానే, ప్రత్యేక జీవోలు జారీ చేసి తమకు కావలసిన వారికి అడ్డగోలుగా ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. అంతర్జాతీయ స్థాయిలో పీవీ సింధు దేశానికి పతకాలు తెచ్చినందున ఆమెకు ప్రత్యేక కేటగిరీ కింద ఉద్యోగం ఇచ్చారని, మరి ఏ విధమైన పరీక్ష లేకుండా ఉద్యోగాలు పొందిన 372 మందిలో ఎంతమందికి అలాంటి ఘనమైన సాధనలు ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. క్రీడాకారులకు కనీస అర్హత పరీక్ష కూడా లేకుండా 372 ఉద్యోగాలు ఇచ్చేయడం వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందని జగన్ ఆరోపించారు.
కౌన్సిల్ లో ఎందుకు మాట్లాడరు..?
మండలిలో ఎందుకు మాట్లాడరంటే.. తప్పులు జరిగాయి కాబట్టి ఆ తప్పులు బయటకు వస్తాయి, లోకేష్ రాజీనామా చేయాల్సిన అవసరం అందరికీ అర్థమవుతుందని మండలిలో చర్చిండం లేదని జగన్ వ్యాఖ్యానించారు.

