కలం, నిర్మల్ రూరల్: చెట్ల నరికివేతతో రోజురోజుకూ పక్షుల ఆవాసాలు కనుమరుగవుతున్న వేళ.. వాటి సంరక్షణకు నిర్మల్ రూరల్ మండలం చిట్యాల (Chityala) గ్రామ సర్పంచ్ ఏనుగు సుప్రియ, బీజేపీ మండల అధ్యక్షుడు వెంకట్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పక్షులకు సురక్షితమైన ఆవాసాలను కల్పించేందుకు చెక్కతో ప్రత్యేకంగా చిన్న చిన్న ఇళ్లను (Wooden Bird Houses) తయారు చేయించి గ్రామంలోని చెట్లకు ఏర్పాటు చేయించారు. వడ్రంగితో ఇల్లు ఆకారంలో రూపొందించిన ఈ చెక్క గూళ్లను చెట్ల కొమ్మలకు అమర్చారు.
దీంతో పక్షులకు సురక్షితమైన నివాసంతో పాటు గుడ్లు పెట్టేందుకు, పిల్లలను పెంచేందుకు అనుకూల వాతావరణం కల్పించినట్లయింది. పక్షుల కిలకిలారావాలు గ్రామాల్లో మార్మోగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని సర్పంచ్ ఏనుగు సుప్రియ, వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రకృతిలో పక్షుల పాత్ర ఎంతో కీలకమని, వాటి ఆవాసాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. గ్రామస్థులు కూడా తమ ఇళ్ల పరిసరాలు, పొలాలు, చెట్ల వద్ద పక్షుల కోసం నీటి పాత్రలు, గూళ్లు ఏర్పాటు చేసి వాటి సంరక్షణకు సహకరించాలని పిలుపునిచ్చారు.
Also Read : ఉధంపూర్లో ఎన్కౌంటర్: భద్రతా దళాల బిగ్ ఆపరేషన్
Follow Us On : WhatsApp

