కలం, వెబ్ డెస్క్ : ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్త ప్రాణాలు తీసేందుకు ఒక భార్య వేసిన స్కెచ్ కలకలం రేపింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లు (Dornakal) మండలం చిలుకోడు గ్రామానికి చెందిన గాదే రాజేశ్వరరావు, భవాని దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రాజేశ్వరరావు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. ఆయన భార్య భవాని కొరియర్ బాయ్ సైదులుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. గత నెల 27న భోజనానికి ఇంటికి వచ్చిన రాజేశ్వరరావు, భార్య వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండగా చూసి నిజం తెలుసుకున్నాడు.
ఈ విషయమై పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టేందుకు తన అన్నను తీసుకురావడానికి వెళ్తున్న రాజేశ్వరరావును ప్రియుడు సైదులు వెంబడించాడు. అతని నుంచి తప్పించుకుని ఇంటికి వచ్చి భవాని ఫోన్ చెక్ చేయగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్తను రోడ్డు ప్రమాదంలో చంపేయాలని, లేకపోతే తాను చనిపోతానని సైదులుకు భవాని పంపిన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ చాటింగ్లు బయటపడ్డాయి. ఆ స్క్రీన్షాట్లతో రాజేశ్వరరావు డోర్నకల్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఖమ్మం రూరల్ స్టేషన్కు బదిలీ చేశారు. పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో బాధితుడు గురువారం ఖమ్మం రూరల్ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు.

