కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ (IPL) 2026 టోర్నీ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రతి ప్లేయర్ రికార్డుల మోత మోగిస్తున్నారు. బ్యాట్తో, బాల్తో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. శనివారం జరిగిన ఢిల్లీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ అయితే పరుగుల సునామీలా సాగిందనే చెప్పాలి. ఇరు జట్ల బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ 152 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత పంజాబ్ జట్టులోని బ్యాటర్లు కూడా ఏమాత్రం తగ్గకుండా 70, 90ల్లో పరుగులు చేశారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ ప్లేయర్ వసీం జాఫర్ (Wasim Jaffer).. ఈ టోర్నీలో అదరగొట్టిన టాప్-3 పర్ఫార్మర్స్ను ఎంచుకున్నాడు. అయితే పంజాబ్పై ఢిల్లీ బ్యాటర్ 152 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ (KL Rahul)కు స్థానం దక్కలేదు. వసీం జాఫర్ టాప్-3 పర్ఫార్మర్స్ వీరే..
వైభవ్ సూర్యవంశీ:
సన్రైజర్స్ హైదరాబాద్పై కేవలం 37 బంతుల్లోనే 12 సిక్సర్లు, 5 ఫోర్లతో వైభవ్ చేసిన 103 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ను జాఫర్ మొదటి స్థానంలో ఉంచారు. ఒక యువ ఆటగాడు సాధించిన తొలి సెంచరీ కావడం విశేషమని ఆయన పేర్కొన్నారు.
అకీల్ హొస్సేన్:
ఈ సీజన్లో బ్యాటర్ల ఆధిపత్యం ఎక్కువగా ఉన్నా, ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై స్పిన్నర్ అకీల్ హొస్సేన్ 17 పరుగులకే 4 వికెట్లు తీసి టాప్ క్లాస్ బౌలింగ్ను ప్రదర్శించారని జాఫర్ ప్రశంసించారు.
అభిషేక్ శర్మ:
ఢిల్లీ క్యాపిటల్స్పై అభిషేక్ శర్మ 68 బంతుల్లో బాదిన 135 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్ను జాఫర్ తన జాబితాలో చేర్చారు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో అభిషేక్ శర్మ (380 పరుగులు) ముందుండగా, పర్పుల్ క్యాప్ రేసులో అన్షుల్ కాంబోజ్ (14 వికెట్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్
ఈ సందర్భంగా ఈ సీజన్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ ఎవరవుతారనే దానిపై కూడా జాఫర్ అంచనా వేశారు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ను ఆయన ఎంచుకున్నారు. రూ. 26.75 కోట్ల భారీ ధర దక్కించుకున్నప్పటికీ, ఒత్తిడిలోనూ శ్రేయాస్ జట్టును అద్భుతంగా నడిపిస్తున్నారని కొనియాడారు. భారీ ధరకు తగినట్లుగా రాణిస్తూ ఫ్రాంచైజీ గర్వపడేలా చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. శ్రేయాస్ ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్ల్లో 186 స్ట్రైక్ రేట్తో 279 పరుగులు చేసి తన జట్టును పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిపారు.

