కలం, వరంగల్ బ్యూరో: ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం అన్నదాతల్లో కొత్త ఆశలు నింపింది. గత కొన్ని వారాలుగా వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ వానలు ఊరటనిచ్చాయి. వర్షంతో పొలాల్లో తేమ పెరగడంతో వరి నాట్లు, పత్తి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటల సాగు పనులు వేగం పుంజుకోనున్నాయి.
హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో పలుచోట్ల వర్షం కురవడంతో ఎండిపోయిన భూములకు జీవం వచ్చింది. దుక్కులు దున్నిన రైతులు విత్తనాలు వేయడానికి సిద్ధమవుతున్నారు. సమయానికి వర్షం కురవడంతో ఈ ఖరీఫ్ సీజన్పై రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వాతావరణ శాఖ మరో కొన్ని రోజుల పాటు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రైతులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయ పనులను చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు.

