కలం, వనపర్తి: విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని స్వయంకృషి, క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని స్కాలర్స్ విద్యాసంస్థల (Scholars College) డైరెక్టర్లు డా. జగదీశ్వర్, డా. వరప్రసాదరావు, డా. నాగేశ్వరరెడ్డి, డా. సత్యనారాయణరెడ్డి సూచించారు. శనివారం వనపర్తిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్హాల్లో నిర్వహించిన స్కాలర్స్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకల్లో వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. చదువుతోపాటు వివిధ రంగాల్లో ప్రతిభ చాటుకుని భవిష్యత్తులో ఉన్నతాధికారులుగా ఎదిగి దేశానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.
చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సాంకేతికతను విద్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసానికి సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. 36 ఏళ్లుగా స్కాలర్స్ విద్యాసంస్థలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నాయని యాజమాన్య సభ్యులు తెలిపారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సందేశాత్మక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన వారితోపాటు NEET, JEE, EAPCETలో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులను మెమెంటోలతో సన్మానించారు.
పూర్వ విద్యార్థులకు సత్కారం..
స్కాలర్స్ కళాశాలలో చదివి వివిధ రంగాల్లో స్థిరపడిన గైనకాలజిస్ట్ డా. సుభద్ర, ప్రిన్సిపాల్ సుప్రజాత, అడ్వకేట్ ఆర్. జ్యోతిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాళ్లు ఎ. శ్రీధర్, బి. మధుసూదన్ గుప్త, డా. నాయకంటి నరసింహశర్మ, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

