కలం,జోగులాంబ గద్వాల: గద్వాల (Gadwal) పట్టణంలో తెలుగు నరేందర్(40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గద్వాల టౌన్ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ తెలిపిన వివరాలిలా ప్రకారం.. వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన తెలుగు నరేందర్ (38) అనే వ్యక్తి గద్వాలలో సత్యసాయి స్కూల్ సమీపంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. కొద్ది సంవత్సరం క్రితం గద్వాలలోని ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండే వాడు. అనంతరం జాబ్ మానేశాడు. అయితే తెలుగు నరేందర్ గద్వాల జిల్లాకు చెందిన ఒక మహిళతో వివాహం జరిగింది. కొన్ని అనివార్యకారణాల వల్ల అతనికి బార్య విడాకులు ఇచ్చినట్లు తెలిసింది.
ఇటీవల నరేందర్ తల్లి మృతి చెందడంతో అతడు మానసిక ఆవేదనకు గురై.. మద్యానికి బానిసయ్యాడు. గత నాలుగురోజుల నుంచి నరేంద్ర ఇంట్లోనే ఉంటున్నాడు. ఈక్రమంలో శనివారం మృతుని ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు గద్వాల టౌన్ పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా, కట్టుకున్న భార్య దూరం అవగా, కన్న తల్లి మృతి చెందడంతో అనాథగా మారిన నరేందర్ డిప్రెషన్ కు లోనై మద్యానికి బానిసై, అనారోగ్యంతో మృతి చెందడం పలువురిని కంటతడి పెట్టించింది.

