కలం, వనపర్తి: వనపర్తి (Wanaparthy) నియోజకవర్గాన్ని పూర్తిగా గుడిసెలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్పష్టం చేశారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పక్కా ఇళ్లు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector Adarsh Surabhi) అధ్యక్షతన ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మొదటి విడతలో ఇళ్లు మంజూరైనా నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులను వెంటనే గుర్తించి, వారి స్థానంలో నిజంగా అవసరమైన అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన 287 గుడిసెలతో పాటు నియోజకవర్గంలోని అన్ని గుడిసెలను పూర్తిస్థాయిలో గుర్తించి జాబితా సిద్ధం చేయాలని, ఇందుకు సంబంధించిన పెండింగ్ అంశాలన్నింటినీ వారం రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టమైన గడువు విధించారు. అలాగే, లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఇంటి నిర్మాణాలు చేపట్టేలా అధికారులు అవసరమైన సహకారం అందించాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ (Wanaparthy Collector) ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయడానికి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని, లబ్ధిదారులకు అన్ని విధాలా సహకరించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ విటోబా, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Also: జెన్ జీ.. వయా ఇన్స్టా.. మోదీ నయా ప్లాన్!
Follow Us On : WhatsApp

