కలం, వనపర్తి : ప్రభుత్వ వసతి గృహాల్లో (government hostels) విద్యార్థులకు మెరుగైన వసతి, మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(Collector Adarsh Surabhi) అధికారులను ఆదేశించారు. బుధవారం వనపర్తి (Wanaparthy)పట్టణంలోని 30వ వార్డులో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో నూతనంగా నిర్మిస్తున్న వంటగది, స్టోర్రూమ్ భవనాలను పరిశీలించారు.
నిర్మాణ పనుల్లో నాణ్యత తప్పనిసరి
నిర్మాణ పనుల నాణ్యత, ఉపయోగిస్తున్న సామగ్రిని పరిశీలించిన కలెక్టర్ నిర్దేశించిన అంచనాల మేరకే పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. అంచనాలకు మించి అదనపు పనులు చేపట్టవద్దని సూచించారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. మరో నెల రోజుల్లో నిర్మాణాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
నాణ్యమైన ఆహారం.. పరిశుభ్రతపై దృష్టి
అనంతరం విద్యార్థులకు అందుతున్న వసతి, ఇతర సౌకర్యాలపై కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత విషయంలో రాజీపడొద్దని, పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలని సూచించారు. వసతి గృహంలోని పరిసరాలు, వంటగది, భోజనశాల, మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతతో పాటు చదువుకు అనుకూలమైన వాతావరణం ఉండేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి రాంజీరావు, తహసీల్దార్ రమేష్రెడ్డి, ఇతర అధికారులు ఆయన వెంట ఉన్నారు.

