కలం, వెబ్డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని (Telangana Liberation Day) ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ (CP Radhakrishnan)తో పాటు రాష్ట్ర గవర్నర్ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వ బలగాలు కవాతు నిర్వహించాయి. వీర సైనిక్ స్మారకం వద్ద జవాన్లకు ఉపరాష్ట్రపతి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నిజాం పాలనలో ప్రజల పరిస్థితులుపై నాటికలను ప్రదర్శించారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ సహా బీజేపీ నేతలు పాల్గొన్నారు. దీనికి ముందు ఉదయం ఈ వేడుకల కోసం హైదరాబాద్కు చేరుకున్న ఉప రాష్ట్రపతికి మంత్రి పొన్నం, బండి సంజయ్, గవర్నర్ శుక్లా, ఎంపీ ఈటల తదితరులు సంయుక్తంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను మరిచిపోరాదని పేర్కొన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ దృఢ సంకల్పంతో చేపట్టిన చారిత్రాత్మక ‘ఆపరేషన్ పోలో’ (Operation Polo) చర్య ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించిందన్నారు. ఆనాడే తెలంగాణ భారత యూనియన్లో విలీనమైందని పేర్కొన్నారు.
కొందరు నాయకులు నిజాం గొప్ప వాడంటూ మాట్లాడటం సిగ్గు చేటన్నారు. నిజాం గొప్ప వాడైత ఆపరేషన్ పోలో ఎందుకు చేపట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఈ విమోచనం (Telangana Liberation Day) వెనుకున్న ఎందరో మహనీయుల అలుపెరగని పోరాట పటిమను, త్యాగాలను భావితరాలకు చాటిచెప్పేందుకే కేంద్రం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు.
Also Read : ప్రజా పాలన దినోత్సవం.. సీఎం కీలక ప్రసంగం
Follow Us On: X(Twitter)

