కలం, కరీంనగర్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుమేరకు కరీంనగర్ నగరంలోని డీర్ పార్కులో బుధవారం సాయంత్రం ఘనంగా వన మహోత్సవ (Van Mahotsav) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడేతో పాటు పలువురు అధికారులు మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం, అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, మహిళలు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, భావితరాలకు పచ్చని తెలంగాణను అందించాలంటే మొక్కల పెంపకాన్ని ప్రజా ఉద్యమంగా చేపట్టాలని అధికారులు పిలుపునిచ్చారు.
అనంతరం హైదరాబాద్లో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగాన్ని డీర్ పార్కులో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, అధికారులు తిలకించారు. అంతకుముందు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ముఖ్యమంత్రి సభను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో షర్మిల, మెప్మా పీడీ స్వరూపారాణి, డీఆర్డీఓ గీత, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, కరీంనగర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ షౌకత్ హుస్సేన్, స్ట్రైక్ ఫోర్స్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ షౌకత్ అలీతో పాటు పలువురు అటవీశాఖ అధికారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

