కలం, వెబ్ డెస్క్ : ముంబైలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ వేదికగా జరుగుతున్న గ్లోబల్ చెస్ ఫెస్టివల్(Mumbai Chess Festival) ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. టోర్నమెంట్ చివరి దశకు చేరుకోగా పోటీ మరింత రసవత్తరంగా మారింది. 8వ రౌండ్ ముగిసే సరికి నేషనల్ ఛాంపియన్ ఇనియన్ పన్నీర్సెల్వం (Iniyan Panneerselvam) ఒక పాయింట్ ఆధిక్యంతో టాప్లో నిలిచాడు. 9వ రౌండ్లో ఒక డ్రా సాధించినా మాస్టర్స్ కేటగిరీ టైటిల్ అతని ఖాతాలో పడే అవకాశముంది. హర్ష్ సురేష్తో జరిగిన మ్యాచ్లో ఇనియన్ సిసిలియన్ డిఫెన్స్తో బరిలోకి దిగాడు. ఇద్దరి మధ్య గట్టి పోరు జరిగినప్పటికీ, చివరకు 40వ ఎత్తులో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఇనియన్ 7 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, బోరిస్ సావ్చెంకో సోహమ్ కమోత్రాపై విజయం సాధించి రెండో స్థానంలో నిలిచాడు.
హర్ష్ సురేష్, ఆకాష్ శరత్ చంద్ర, అపూర్వ్ కాంబ్లే, అజయ్ సంతోష్ 5.5 పాయింట్లతో పోటీలో ఉన్నారు. చివరి రౌండ్లో ఇనియన్, అజయ్ సంతోష్తో తలపడనున్నాడు. ఉమెన్ గ్రాండ్మాస్టర్ నార్మ్ కోసం పోరాడుతున్న ఓషిని గుణవర్ధనకు షాక్ తగిలింది. వేదాంత్ పనేసర్ చేతిలో ఓటమి పాలైంది. ఇక ఛాలెంజర్స్ కేటగిరీలో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఒడిశాకు చెందిన ఆశీర్వాద్ స్వైన్, టాప్లో ఉన్న వీరేష్ శరణార్థిని 75 ఎత్తుల దీర్ఘ పోరులో ఓడించి సంచలనం సృష్టించాడు. ఈ ఓటమితో వీరేష్ మూడో స్థానానికి పడిపోయాడు. అదే సమయంలో నితిన్ బాబు, ఎఫ్ఎం అరుణ్ కటారియాపై గెలిచి 7 పాయింట్లతో జాయింట్ టాప్లో నిలిచాడు.
ఆశీర్వాద్ స్వైన్, నితిన్ బాబు ఇద్దరూ టైటిల్ కోసం చివరి రౌండ్లో నేరుగా తలపడనున్నారు. జూనియర్ మాస్టర్స్ కేటగిరీలో మాధ్వేంద్ర ప్రతాప్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నాడు. వినాయక్ కోలేరుపై 67 ఎత్తుల్లో విజయం సాధించి 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. చివరి రౌండ్లో డ్రా సాధించినా టైటిల్ అతనిదే. ఒకవేళ ఓడిపోతే అంకిత్ దాస్, బాలనందన్, అమన్లాల్లకు అవకాశాలు ఉన్నాయి.ఈ టోర్నమెంట్లో భారీ ప్రైజ్ మనీతో పాటు, ఛాలెంజర్స్ , జూనియర్స్ కేటగిరీలలో విజేతలకు వచ్చే ఏడాది ఎలైట్ మాస్టర్స్ కేటగిరీలో నేరుగా ప్రవేశం లభించనుంది. దీంతో అన్ని విభాగాలలోనూ ఆటగాళ్లు టైటిల్ కోసం చివరి వరకు పోరాడేందుకు సిద్ధమయ్యారు.

