కలం, వెబ్డెస్క్: ఉత్తర్ప్రదేశ్లోని (Uttar Pradesh) సంత్ కబీర్నగర్లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. 21 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకొని, ఐదుగురు పిల్లల్ని కన్న తర్వాత భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేశాడు ఓ భర్త. ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కబీర్ నగర్లో ఉండే బుద్దిరామ్ నిషాద్ (45), ఫూల్ మతి (37) దంపతులకు కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఫూల్మతి స్థానికంగా నివాసం ఉండే తన కంటే 13 ఏళ్లు చిన్న వాడైన అవధేశ్ (26) అనే యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై భార్యభర్తలకు తరచూ వాగ్వాదం జరిగేది.
ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఫూల్మతి కుటుంబాన్ని వదిలి అవధేశ్తో కలిసి పంజాబ్కి వెళ్లిపోయింది. తర్వాత కుటుంబసభ్యులు పదేపదే ప్రాధేయపడటంతో తిరిగి ఇంటికి వచ్చింది. అయితే మళ్లీ ప్రియుడిని రహస్యంగా కలవడం స్టార్ట్ చేసింది. అవధేశ్తోనే కలిసి ఉంటానని భర్తకు తేల్చి చెప్పింది. దీంతో చేసేదేంలేక బుద్ధిరామ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు.
గ్రామస్తులు, కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో స్థానిక శివాలయంలో ఫూల్మతి, అవధేశ్కు వివాహం జరిపించాడు. పెళ్లి తర్వాత నూతన దంపతులు బుద్ధిరామ్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత ఐదుగురు పిల్లల్లో చిన్న కుమారుడిని తీసుకొని ఫూల్మతి, అవధేశ్ లక్నోకు వెళ్లిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బయట జరుగుతున్న దారుణాలను చూసి ప్రాణ భయంతోనే ఈ పెళ్లి చేసి ఉంటాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

