కలం, వెబ్ డెస్క్ : కేంద్ర రైల్వే, సమాచార సాంకేతిక శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) నేడు తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన హైదరాబాద్లో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఐటీ, పారిశ్రామిక రంగాల ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కేంద్రమంత్రి ముఖాముఖి చర్చలు జరుపుతున్నారు. దేశంలో సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలపై ఈ సందర్భంగా ఆయన వారితో చర్చిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్ పర్యటన అనంతరం కేంద్రమంత్రి కొండకల్లోని మేధా సర్వో డ్రైవ్స్ రైలు బోగీల తయారీ ఫ్యాక్టరీని సందర్శించనున్నారు. అక్కడ రైలు బోగీల ఉత్పత్తి ప్రక్రియను, ఫ్యాక్టరీలోని అత్యాధునిక సాంకేతికతను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. మేధా సర్వ్ డ్రైవ్స్ పరిశ్రమ ప్రతినిధులతో మాట్లాడి, స్వదేశీ రైల్వే తయారీ రంగానికి అందుతున్న ప్రోత్సాహం, భవిష్యత్తు ప్రణాళికలపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

