కలం, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన భేటీ అయి కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రెండు నేషనల్ హైవేస్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.7697 కోట్లతో ఈ రెండు నాలుగు వరుసల జాతీయ రహదారులను విస్తరించనుంది. ఆర్మూర్ – జగిత్యాల – మంచిర్యాల రహదారి (NH 63) విస్తరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జగిత్యాల – కరీంనగర్ జాతీయ రహదారి (NH 563) బీవోటీ పద్ధతిలో విస్తరణకు అంగీకారం చెప్పింది.
అలాగే, భారతీయ విమానయాన సంస్థల దేశీయ, అంతర్జాతీయ రవాణాకు సంబంధించి ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ మద్దతు అందించేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (ఓఎంసీలకు) రూ.10,000 కోట్లకు మించని ఒకేసారి బడ్జెట్ మద్దతును ఆమోదించింది. ఇంధన ధరల అస్థిరత సమయంలో విమానయాన సంస్థలకు స్థిరమైన ఏటీఎఫ్ ధరలను అందించడానికి వీలుగా ఓఎంసీలకు ఈ మద్దతును అందిస్తారు.

