కలం, మహబూబ్నగర్ బ్యూరో: విద్యార్థుల భద్రతే ధ్యేయంగా జిల్లా రవాణా శాఖ అధికారి (DTO) రాధిక ఆదేశాల మేరకు బుధవారం గద్వాల (Gadwal) జిల్లా అయిజ పట్టణంలో గద్వాల రవాణా శాఖ అధికారులు విస్తృతంగా ప్రైవేటు స్కూల్ బస్సుల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా పట్టణంలోని వివిధ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బస్సుల ఫిట్నెస్ పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా, కనీస ఫిట్నెస్ లేకుండా నడుపుతున్న కాకతీయ, వైష్ణవి పాఠశాలలకు చెందిన రెండు బస్సులను రవాణా శాఖ అధికారులు పట్టుకున్నారు.
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా నడుపుతున్న ఈ రెండు బస్సులను తక్షణమే సీజ్ చేసి, స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించినట్లు గద్వాల (Gadwal) మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (MVI) రామ్ చరణ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంవీఐ రామ్ చరణ్ మాట్లాడుతూ.. పాఠశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా రవాణా శాఖ నిబంధనలు పాటించాలని, విద్యార్థుల రవాణా విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ఫిట్నెస్ లేని వాహనాలను రోడ్లపైకి తెస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ తనిఖీ కార్యక్రమాల్లో గద్వాల రవాణా శాఖ కార్యాలయ సిబ్బంది గోవర్ధన్, రిషి, గోవిందు తదితరులు పాల్గొన్నారు.
Read Also: పోలీసుల అదుపులో పట్టభద్రుల అభ్యర్థి అశోక్..?
Follow Us On: Instagram

