కలం, వెబ్ డెస్క్: తమిళనాడులో ఘోరం జరిగింది. తొమ్మిది మంది సభ్యుల ఓ ముఠా కత్తులతో ఇద్దరిని దారుణంగా నరికి చంపింది. మరో ఐదుగురిని తీవ్రంగా గాయపర్చింది. చనిపోయినవాళ్లలో ఒకరు స్థానికుడు కాగా, మరొకరు ఒడిశా నుంచి వచ్చిన వలస కార్మికుడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరునెల్వేలి(Tirunelveli) జిల్లా నంగునేరి సమీపంలోని ఓ టీషాపు వద్ద సోమవారం రాత్రి కొందరు టీ తాగుతుండగా హఠాత్తుగా తొమ్మది మంది సభ్యుల గ్యాంగ్ మూడు బైక్ల్లో అక్కడికి వచ్చి, దాడికి దిగింది. కర్రలు, కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసింది. దీంతో పెరుంపత్తు గ్రామానికి చెందిన జాన్ మార్క్(47)తో పాటు ఒడిశా వలసకార్మికుడు శ్రీనాథ్ గడ్డ(57) అక్కడికక్కడే మరణించారు. ఎ.నెల్సన్, ప్రభాకరన్, వి.రామస్వామి, ఎ.గణేశన్, ఎస్.శశికుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వీళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
విషయం తెలిసి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, దర్యాప్తు చేస్తున్నారు. దాడికి కారణమేంటో తెలియలేదని పోలీసులు వెల్లడించారు. హంతకులను పట్టుకోవడానికి స్పెషల్ టీమ్లను ఏర్పాటుచేశారు. ఇద్దరి దారుణ హత్యతో స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మంగళవారం ఉదయం రోడ్డు రోకో నిర్వహించారు. హంతకులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ హత్యలు(Tirunelveli) తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు రేపాయి. డీఎంకే పాలనలో రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు ఈ ఘటన నిదర్శనమని ఏఐఏడీంకే విమర్శించింది. తమిళనటుడు, హీరో విజయ్ టీవీకే పార్టీ సైతం.. అధికార పార్టీని తీవ్రంగా తప్పుపట్టింది. డీఎంకే పాలనలో అరాచకశక్తులు పేట్రేగిపోతున్నాయని, ఇది ప్రభుత్వ అసమర్థత అని మండిపడింది.
కాగా, ఇటీవల తమిళనాడులోని ఓ రైల్లో ఒడిశా వలస కార్మికుడిని కొందరు యువకులు కట్టేసి కొట్టి, దారుణంగా హింసించి, వీడియో తీసిన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పడు ఏకంగా మరో ఒడిశా వ్యక్తిని కత్తులతో నరికి చంపడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Read Also: యాదాద్రి జిల్లాలో విషాదం: ఇద్దరు చిన్నారులను చంపి తల్లి ఆత్మహత్య
Follow Us On : WhatsApp

