కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో 190ని తక్షణమే అమలు చేయాలని టీఆర్ఎస్ అధినేత్రి కవిత (TRS Chief Kavitha) డిమాండ్ చేశారు. 317 జీవో వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. దీనికి ఉపశమనంగా కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 190 జీవోను తీసుకొచ్చి ఆ తర్వాత చేతులు దులుపుకుందని మండిపడ్డారు. జీవో 190 వల్ల జీవో 317 బాధితులకు మూడేండ్ల పాటు స్థానిక జిల్లాలలో పోస్టింగ్లు పొందే సడలింపు ఉంటుందని గుర్తు చేశారు.
అయితే ఈ జీవోను విద్యాశాఖ మాత్రం అమలు చేయడం లేదని కవిత ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో విఫలమైందని ఫైర్ అయ్యారు. జీవో 317 బాధితులకు న్యాయం చేసేందుకు తెచ్చిన జీవో 190ని తెచ్చి 9 నెలలైనా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. సూపర్ న్యూమరీ పోస్టుల హామీ ఏమైందని నిలదీశారు. తక్షణమే జీవో 190ని అమలు చేసి బాధిత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.

