కలం, వెబ్ డెస్క్: ఏపీలో ఉద్యోగ విరమణ చేయబోతున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పి.వి.సునీల్ కుమార్కు (PV Sunil Kumar) సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్లో ట్రిబ్యునల్(క్యాట్)లో భారీ షాక్ తగిలింది. తనపై రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసింది. దీంతో ఆయన రిటైర్డ్ అయిన తదుపరి చర్యలు కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మార్గం సుగుమం అయినట్లయింది.
బెనిఫిట్స్ ఆపాలని సునీల్ భార్య విన్నపం..
పి.వి.సునీల్ కుమార్కు ఉద్యగ విరమణ అనంతరం వచ్చే ప్రయోజనాలు ఆపాలని అతడి భార్య అరుణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అలా చేస్తే, తన జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందని అందులో స్పష్టం చేశారు. పి.వి.సునీల్ కుమార్ పై 2017లో అరుణ వరకట్నం, గృహ హింస కేసు పెట్టి దూరంగా ఉంటూ వస్తున్నారు. క్యాట్ తీర్పు వెలువడిన సమయంలో.. సునీల్ భార్య ఇలా ప్రభుత్వానికి లేఖ రాయడం గమనార్హం.
విచారణ పూర్తయితేనే..
డీజీపీ హోదా ఉన్న పి.వి.సునీల్ కుమార్ వైసీపీ ప్రభుత్వంలో సీఐడీ చీఫ్గా వ్యవహరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ప్రతి ఆరు నెలలకోసారి సస్పెన్షన్ పొడిగిస్తూ వస్తోంది. మంగళవారం నాడు ఆయన ఉద్యోగ విరమణ చేయబోతుండగా.. సస్పెన్షన్ మాత్రమే ఎత్తివేస్తూ, రిటైర్డ్ అయ్యేందుకు సర్వీస్ రిలీవ్ చేసింది. అయితే, ఉద్యోగ విరమణ అనంతరం వచ్చే ప్రయోజనాలు మాత్రం, ఆయనపై నమోదైన కేసుల విచారణ కొలిక్కి వచ్చాకే ఉంటాయని స్పష్టం చేసింది.
ఇద్దరి మధ్య మాటల యుద్ధం..
ప్రస్తుతం పి.వి.సునీల్ కుమార్పై రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లినందుకు శాఖాపరమైన చర్య కింద ఆయనపై కూటమి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. గత రెండేళ్ల కాలంలో రఘురామకృష్ణంరాజు, పి.వి.సునీల్ కుమార్ మధ్య పలుమార్లు మాటల యుద్ధం జరుగుతూ వస్తోంది.

