కలం, వెబ్ డెస్క్ : రాజమండ్రి (Rajahmundry)లో సంచలనం సృష్టించిన కల్తీ పాల ఘటనలో దర్యాప్తు అధికారులు కీలక విషయాలను వెల్లడించారు. కూలింగ్ ఛాంబర్ లో వాడే కూలెంట్ లీక్ కావడం వల్లే పాలు విషతుల్యంగా మారాయని ప్రాథమికంగా నిర్ధారించారు. సాధారణంగా పాలను చల్లబరిచే ప్రక్రియలో ఇథలిన్ గ్లైకాల్ అనే రసాయనాన్ని వినియోగిస్తారని, అది అత్యంత ప్రమాదకరమైన విషపదార్థమని పోలీసులు తెలిపారు. ఈ రసాయనం పాలలో కలవడం వల్లే వినియోగదారులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు గుర్తించారు.
సుమారు 40 లీటర్ల పాలలో ఈ రసాయనం కలిసినట్లు అధికారులు గుర్తించి, ఆ నమూనాలను స్టేట్ ఫుడ్ లాబొరేటరీకి తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పాల వ్యాపారి గణేష్ ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే గణేష్ కూడా తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రి పాలయ్యాడు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఈ విషపూరిత పాలు తాగి అస్వస్థతకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం కలకలం రేపుతోంది. కిడ్నీ సమస్యతో ఆదిలక్ష్మి అనే మహిళ మంగళవారం కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మరణించగా, మరో 12 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

