Mobile Popup Ad
Mobile Popup Ad

మొన్న‌ ప‌వ‌న్‌.. నిన్న‌ బ‌న్నీ.. ఫ్యాన్స్ కోరిక నెర‌వేరుస్తున్న స్టార్స్‌!

క‌లం, వెబ్ డెస్క్: టాలీవుడ్​ స్టార్స్​ (Tollywood Stars) సిల్వర్​ స్క్రీన్​పైనే కాదు రియల్​ లైఫ్​లోనూ హీరోలమే అని నిరూపించుకుంటున్నారు. దేశంలో వేరే చిత్ర పరిశ్రమలతో పోలిస్తే తెలుగులో సినిమా స్టార్లకు ఉండే క్రేజ్​ వేరే లెవెల్​. తమ అభిమాన నటులను చూడాలని, మాట్లాడాలని, వారిని కలవాలని ఆరాటపడే వాళ్లు ఎంద‌రో ఉంటారు. అలాంటి ఫ్యాన్స్​ చిన్న చిన్న కోరికలను, వారి కలలను నెరవేరుస్తూ హీరోలు చేస్తున్న పనులు సోషల్ మీడియాలో ఒక సరికొత్త ట్రెండ్‌గా మారాయి. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన పెళ్లికి పిలవలేదని ముద్దుగా అలిగిన ఒక చిన్నపాపను స్వయంగా కలవడంతో మొదలైన ఈ ట్రెండ్, ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల వరకు చేరి అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

స్టార్​ హీరో విజయ్​ దేవరకొండ (Vijay Deverakonda), హీరోయిన్​ రష్మిక మందన్నాలు ఫిబ్ర‌వ‌రి 26న పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. వీరి పెళ్లి సోష‌ల్ మీడియాలో ఒక సంచ‌ల‌నం. పెళ్లి జ‌రిగిన త‌ర్వాత సైతం ప‌ది ప‌దిహేను రోజుల పాటు సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసిన వీళ్ల ఫోటోలు, వీడియోలే ద‌ర్శ‌న‌మిచ్చాయి. ఈ సంద‌ర్భంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ చిన్న పాప చేసిన వీడియో వైర‌ల్‌గా మారింది. విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక పెళ్లికి త‌న‌ను పిల‌వ‌లేదంటూ పాప వీడియోలో చెప్పింది. దీనికి విజ‌య్ దంప‌తులు సోష‌ల్ మీడియాలో రిప్లై ఇవ్వ‌డ‌మే కాకుండా స్వ‌యంగా పాప‌ను లంచ్‌కు ఆహ్వానించారు. ఈ పాప‌తో పాటు కొంద‌రు ఫ్యాన్స్‌కు కూడా ర‌ష్మిక‌, విజ‌య్ ప్ర‌త్యేకంగా విందు ఏర్పాటు చేశారు. అలాగే దేశంలోని ప‌లు ప్ర‌దేశాల్లో అన్న‌దానం, స్వీట్ బాక్సులు కూడా పంచారు. ఈ జంట చేసిన ప‌నుల‌కు ఫ్యాన్స్‌తో పాటు సామాన్య ప్ర‌జ‌లు కూడా ఫిదా అయిపోయారు.

ఇక విజ‌య్ త‌ర్వాత ఎన్టీఆర్ (NTR) త‌న‌ అభిమాని పట్ల చూపించిన ఆప్యాయ‌త సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్టీఆర్ తొలిసారి స్వయంగా కుకీస్ తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ‘మా ఇద్దరు పిల్లల కోసం రెండు కుకీలు పంపన్నా’ అని సాయితేజ అనే అభిమాని సరదాగా అడిగాడు. దానికి ఎన్టీఆర్ ఏమాత్రం ఆలోచించకుండా ‘అడ్రస్ పెట్టు’ అంటూ అంతే ఫన్నీగా రిప్లై ఇచ్చారు. అన్నట్లుగానే ఎన్టీఆర్ తన ఆటోగ్రాఫ్‌తో కూడిన కుకీస్‌ను ఆ అభిమాని ఇంటికి పంపించాడు. ఆ పిల్లలు వాటిని తింటున్న వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.

ఇటీవ‌ల‌ జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సైతం ఓ అభిమాని విష‌యంలో గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న హన్మకొండకు చెందిన నిరంజన్ అనే దివ్యాంగ బాలుడి కోరిక మేరకు పవన్ కళ్యాణ్ అతడిని స్వయంగా కలిశారు. అంతటితో ఆగకుండా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి అండగా నిలబడ్డారు. అంతేకాకుండా ఆ బాబు కోసం ఒక ట్యాబ్‌తో పాటు, ఒక చిన్న‌ కుక్కపిల్లను గిఫ్ట్‌గా పంపించారు. ఆ చిన్నారి దానికి ప్రేమగా రెక్స్ అని పేరు పెట్టుకున్నాడు. ఈ ఘటన వేలాది మంది అభిమానులకు స్ఫూర్తిగా నిలిచింది. ఈ ఘటన అనంతరం పలువురు ప్రముఖులు ఆ బాబుకు లక్షలాది రూపాయల్లో విరాళాలు అందిస్తున్నారు.

లేటెస్ట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సైతం ఓ చిన్నారి చిరునవ్వు కోసం ముందుకొచ్చారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ అల్లు అర్జున్‌తో మాట్లాడాలని ఆరాటపడిన శ్రద్ధ అనే చిన్నారి కోరికను బన్నీ నెరవేర్చారు. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ వెంటనే ఆ చిన్నారికి వీడియో కాల్ చేసి చాలా ఆప్యాయంగా పలకరించారు. ఇలా వరుసగా టాలీవుడ్ స్టార్స్ అందరూ తమ బిజీ షెడ్యూల్స్‌లోనూ అభిమానుల కోసం సమయం కేటాయిస్తూ, వారి ముఖాల్లో ఆనందాన్ని నింపుతుండటం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>