టిప్పర్ వాహనంలో మంటలు.. చూస్తుండగానే దగ్ధం

కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ (Nalgonda) జిల్లా చండూరు (Chandur) మండలంలో పెను ప్రమాదం సంభవించింది. రోడ్డు విస్తరణ పనుల్లో నిమగ్నమైన ఒక టిప్పర్ లారీ (Tipper Lorry) చూస్తుండగానే అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ సజీవ దహనం నుంచి తప్పించుకున్నప్పటికీ తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామ సమీపంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల కోసం మట్టిని తరలిస్తున్న ఓ టిప్పర్ లారీ గ్రామం వైపు వస్తుండగా, ఒక్కసారిగా ఇంజిన్ భాగం నుండి పొగలు రావడం మొదలైంది. సెకన్ల వ్యవధిలోనే మంటలు క్యాబిన్‌ను చుట్టుముట్టాయి. వాహనంలోని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు.

ఎండ తీవ్రతకు తోడు వాహనంలో సాంకేతిక లోపం తలెత్తడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. మంటల ధాటికి టిప్పర్ టైర్లు పేలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే మంటలు ఒక్కసారిగా అలుముకోవడంతో డ్రైవర్ బయటకు వచ్చే క్రమంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఒళ్లంతా కాలిపోయిన స్థితిలో ఉన్న అతడిని స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో వైద్యులు అతనికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>