కలం,మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం (Gaddapotharam) మున్సిపల్ కేంద్రంలో అర్ధరాత్రి వేళ దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక ఓ ప్రైవేటు బ్యాంక్ కు చెందిన ఏటీఎంలో చొరబడిన దుండగులు నగదును దోచుకెళ్లారు. పక్కాగా స్కెచ్ వేసిన నిందితులు, ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేశారు.
డబ్బులు ఉండే లాకర్ భాగాన్ని పూర్తిగా పగలగొట్టి, అందులో ఉన్న సుమారు ఒక లక్ష అరవై వేల రూపాయల నగదుతో పరారయ్యారు. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ ముమ్మరం చేశారు.

