కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె (TGSRTC Strike) రెండో రోజు కొనసాగుతోంది. గురువారం సైతం కార్మికులు విధులకు హాజరు కాలేదు. దీంతో అధికారులు తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపిస్తున్నారు. కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమించింది. యాజమాన్యం తీరుపై కార్మికులు మండిపడుతున్నారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఆర్డీసీ డిపోల వద్ద పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. పలు చోట్ల పోలీసులు కార్మికులను అదుపులోకి తీసుకుంటున్నారు. తమ డిమాండ్లు అన్నీ పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ తేల్చి చెప్పింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కార్మికులు కోరుతున్నారు. అన్ని డిపోల ఎదుట నేడు మహా ధర్నా చేయాలని కార్మికులు నిర్ణయించారు. రాణిగంజ్ డిపో వద్ద జరిగే ధర్నాకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై కార్మికులకు మద్దతు తెలుపనున్నారు.

