కలం, ఖమ్మం బ్యూరో: నూతన విద్యా సంవత్సరం 2026-27కు సంబంధించి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అందుబాటులో ఉండేలా విద్యాశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. పాల్వంచ (Palwancha) పట్టణంలోని పుస్తకాల గోదాము నుంచి మండల విద్యాశాఖ అధికారి శ్రీరామ్మూర్తి సోమవారం ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాల పంపిణీ (Textbook Distribution) కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాలలు ప్రారంభం కాకముందే జిల్లా గోదాము నుంచి పాఠ్యపుస్తకాలను పాల్వంచకు తరలించి, మండలంలోని 75 మండల పరిషత్, జిల్లా పరిషత్, ఎయిడెడ్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యాశాఖ యూడైస్ వివరాల ఆధారంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలను ముందుగానే సిద్ధం చేసి పంపిణీ చేస్తోందన్నారు. జూన్ 12న పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యా వనరుల సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

