కలం, మెదక్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలను జూన్ 15వ తేదీ సోమవారం నుండి పునః ప్రారంభించాలని (Schools Reopening) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వేసవి సెలవులు ముగిసిన అనంతరం జూన్ 12వ తేదిన పాఠశాలలు తిరిగి తెరుచుకోవాల్సి ఉన్నప్పటికి 15 తేది వరకు విద్యాశాఖ పొడిగించింది. జూన్ 13 రెండవ శనివారం, 14 ఆదివారం కావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల సౌకర్యార్థం విద్యాశాఖ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేస్తూ పాఠశాలల పునః ప్రారంభ తేదీని జూన్ 15 గా నిర్ణయించారు.
అమావాస్య సెంటిమెంట్
అయితే 15 (సోమవారం)న అమావాస్య కావడంతో తల్లిదండ్రులు , వివిధ పాఠశాల యాజమాన్యాల నుండి అభ్యంతరాలు వస్తున్నాయి. వేసవి సెలవుల తర్వాత అమావాస్య రోజే విద్యా సంవత్సరం ప్రారంభం కావడంపై పలు రకాల అభ్యంతరాలు, విమర్శలు వస్తున్నాయి. అమావాస్య రోజున సహజంగా కొత్త పనులు ప్రారంభించడం మంచిది కాదు అంటారు. అలా విద్యా సంవత్సరం అమావాస్య రోజే రావడంతో తమ పిల్లలను పాఠశాలకు పంపడానికి తల్లిదండ్రులు అసక్తి చూపడం లేదు. అదే విధంగా మరుసటి రోజు 16 మంగళవారం వస్తుండటంతో, మంగళ వారం రోజున కుడా ఎలాంటి శుభ కార్యాలు గాని నిర్వహించారు. దీంతో మంగళ వారం రోజున కూడా తమ పిల్లల్ని తొలిసారి ఈ ఏడాది స్కూల్ కు పంపడానికి తల్లితండ్రులు సంకోచిస్తున్నారు. 17 తేది బుధవారం తమ పిల్లల్ని పంపడానికి సిద్ధమౌతున్నారు తల్లిదండ్రులు.
గందరగోళం మధ్య స్కూళ్ల రీ- ఓపెనింగ్
విద్యాశాఖ అదేశాలు పాటించక తప్పదు గనుక ప్రభుత్వ పాఠశాలలు షెడ్యూల్ ప్రకారం 15 తేదిన పునః ప్రారంభం కానున్నాయి. అయితే ప్రైవేటు స్కూల్స్ మాత్రం అమావాస్య ప్రభావం నుంచి తప్పించుకోవడానికి 12వ తేదినే ( నేడు) కొన్ని స్కూల్స్ ను ఓపెన్ చేసి, రెండు రోజులు సెలవులు ఇచ్చారు. కొన్ని కార్పొరేట్ స్కూల్స్ అయితే ముందస్తుగా 8వ తేది లేదా పదో తేదినే క్లాసులను ప్రారంభించాయి. ప్రైవేటు స్కూల్ మేనెజ్ మెంట్ సైతం పేరెంట్స్ నుండి వస్తున్న విజ్ఞప్తి మేరకు అకడమిక్ ఇయర్ ను అమవాస్య రోజే ఎందుకు స్టార్ట్ చేయాలి అనే భావనతో 15వ తేదీన స్కూల్స్ రీ ఓపెన్ (Schools Reopening) చేసేందుకు అసక్తి చూపడం లేదు. తల్లిదండ్రుల నుండి అమావాస్య అభ్యంతరం వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూసే దోరణిలో ఉన్నాయి కొన్ని ప్రైవేటు స్కూల్ సంస్థలు.
మూఢ విశ్వాసాలను పెంచినట్టే
అయితే పాఠశాలల పునః ప్రారంభంకు అమావాస్యకు సంబంధం పెట్టడం సరికాదని, శాస్త్ర సాంకేతికత పెరిగి అర్టిఫియల్ ఇంటలినెన్స్ (ఏఐ) నడుస్తున్న యుగంలోనూ ఈ తరహా నమ్మకాలు గురించి అలోచించడం సరికాదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. విద్యార్థి దశలోనే పిల్లలకు ఇలాంటి అమావాస్య తరహా సెలవుల పై చర్చ జరగడం వలన వారికి అనవసరంగా మూఢ విశ్వాసాలు, నమ్మకాల పై అభిప్రాయలు ఏర్పాడుతాయని చెబుతున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు విజ్ఞానం పెంపొందించాల్సింది పోయి.. మూఢ విశ్వాసాలను పెంచేలా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.
Read Also: డిజిటల్ చెరలో బాల్యం.. మార్పు మన నుండే మొదలవ్వాలి!
Follow Us On: X(Twitter)

