కలం, వెబ్ డెస్క్: మహిళల భద్రత కోసం తెలంగాణ పోలీస్ శాఖ ‘స్త్రీ రైడ్’ (STHREE RIDE) ప్రారంభించింది. విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో మహిళలు కారు డ్రైవర్లు, బైక్ రైడర్లుగా నియమితులు కాగా, ఈ కార్యక్రమాన్ని డీజీపీ సీవీ.ఆనంద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మహిళలు తల్చుకుంటే ఏదైనా చేయగల్గుతారని, ఒకరు అవకాశాలు ఇవ్వడం, అవకాశాలు సృష్టించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టిందన్నారు. షీ టీమ్స్, షీ షటల్స్, షీ యాప్స్, షీ క్యాబ్స్, భరోసా కేంద్రాలు, కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.
మహిళా పోలీస్ అధికారులకు కీలక పోస్టింగ్స్..
పోలీస్ శాఖలోని మహిళా అధికారులకు కూడా ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని డీజీపీ సీవీ.ఆనంద్ తెలిపారు. కీలకమైన జోన్లకు మహిళా డీసీపీలను నియమించినట్లు వివరించారు. అంతేగాకుండా పలు పోలీస్ స్టేషన్లలో మహిళా సీఐ, ఎస్సైలను స్టేషన్ హౌజ్ ఆఫీసర్లుగా పోస్టింగ్స్ ఇచ్చామన్నారు. స్త్రీ రైడ్ కార్యక్రమంతో మహిళలకు భద్రత, మద్దతుతో పాటు వారిలో సాధికారిత సాధ్యమవుతుందన్నారు. విమెన్ డ్రైవర్లకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.

