కలం, వెబ్ డెస్క్: తెలంగాణ పోలీసు (Telangana Police) సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకున్నది. పోలీసులకు పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం రోజున సెలవు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీ బీ శివధర్ రెడ్డి సర్క్యులర్ విడుదల చేశారు.
పోలీసుల (Telangana Police) విధులు అత్యంత కఠినమైనవని, విధి నిర్వహణలో వారు ఎన్నో వ్యక్తిగత త్యాగాలు చేస్తున్నారని శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) పేర్కొన్నారు. పోలీసుల్లో మనోబలాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన వ్యక్తిగత సందర్భాలను గడపడానికి ఈ అవకాశం కల్పించామన్నారు. తద్వారా వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్ కొంతమేర బ్యాలెన్స్ అవుతుందని పేర్కొన్నారు.
అయితే ఈ సెలవును హక్కుగా పరిగణించరాదని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితులు మినహా, అధికారులు తప్పనిసరిగా సెలవు మంజూరు చేయాలని ఆదేశించారు. సంబంధిత ఉద్యోగి ముందస్తుగా లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేయడం, అలాగే సర్వీస్ రిజిస్టర్లో ఉన్న వివరాల ప్రకారం ధృవీకరణ ఉండాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలను రాష్ట్రంలోని అన్ని పోలీసు యూనిట్లకు పంపించి, తక్షణం అమలు చేయాలని సూచించారు.
Read Also: భారత్ ఫ్యూచర్ సిటీ కేంద్రంగా హైస్పీడ్ రైల్ కారిడార్ హబ్: మంత్రి కోమటిరెడ్డి
Follow Us On: WhatsApp

