కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ శుభవార్త తెలిపింది. జూన్ 15 వరకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు (Paddy Procurement) జరపాలని వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 70.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు వెల్లడించారు. రైతుల వద్ద ఉన్న చివరి గింజ వరకు కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ఈ నెల 15వ తేదీ వరకు కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయని చెప్పారు. ధాన్యం నిల్వలు ఇంకా అధికంగా ఉన్న నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయా జిల్లాల్లో కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు.
సేకరించిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించేలా రవాణా సదుపాయాలను పర్యవేక్షించాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభం కానుండటంతో కొనుగోలు కేంద్రాల్లో తార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, అకాల వర్షాల వల్ల రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రాత్రి పగలు శ్రమిస్తున్న హమాలీలు, స్వీపర్ల సంక్షేమం పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి చెప్పారు. వారి జీతాలను పెంచేలా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అలాగే రైతుల ఖాతాల్లోకి సకాలంలో డబ్బులు జమ అయ్యేలా పర్యవేక్షించాలని తెలిపారు.

