కలం, కరీంనగర్ బ్యూరో : ప్రజల సమస్యల పరిష్కార వ్యవస్థను మరింత పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు చేరువ చేసేందుకు ‘ప్రజావాణి’ (Prajavani) కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరిస్తూ ఉత్తర్వులు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజావాణి ప్రహసనమే!! నామ్ కే వాస్తే గా మారిన ప్రోగ్రామ్.. ఫిర్యాదుల స్వీకరణకే పరిమితం అనే శీర్షికన ‘కలం’ టాస్క్ ఫోర్స్ కథనానికి ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు మండల స్థాయిలో నిర్వహణకు ఆదేశించింది.
ప్రతి వారం సోమవారం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ (MPDO) నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. తహసీల్దార్, ఎంపీఓ, మండల వ్యవసాయ అధికారి, ఎంఈఓ, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి, పోలీస్, ఇతర మండల స్థాయి శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించి, వెంటనే చర్యలు చేపడతారు.
అన్ని సౌకర్యాలతో ప్రజావాణి
మండల స్థాయిలో వచ్చే ప్రతి ఫిర్యాదును ఏకీకృత ‘ప్రజావాణి పోర్టల్’లో నమోదు చేసి, ఫిర్యాదుదారునికి గ్రీవెన్స్ ఐడీ (Grievance ID) తో కూడిన రసీదును అందిస్తారు. వికలాంగులు, వయోవృద్ధులు, గర్భిణులు మరియు బాలింతలకు అర్జీల సమర్పణలో మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మంచినీరు, కూర్చోవడానికి సీటింగ్, హెల్ప్డెస్క్ వంటి ప్రాథమిక సౌకర్యాలను ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేస్తారు. ప్రజా సమస్యలను స్థానిక స్థాయిలోనే త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది

