కలం, వెబ్ డెస్క్: యూపీఎస్సీ శుక్రవారం విడుదల చేసిన సివిల్స్ సర్వీసెస్ 2025 (Civil Services 2025) పరీక్ష ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. వెయ్యిలోపు ర్యాంకుల్లో రాష్ట్రం నుంచి 20 మంది నిలిచారు. వీళ్లలో నలుగురు అమ్మాయిలు ఉన్నారు. కేటగిరీల వారీగా జనరల్–3, ఎస్టీ–4, ఎస్సీ–3, ఓబీసీ–10 మంది ఉన్నారు. పెద్దపల్లికి చెందిన గుడెల్లి సృజన అత్యుత్తమంగా జాతీయ స్థాయిలో 55వ ర్యాంకు పొందారు. విజేతలకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
జిల్లాలు, ర్యాంకుల వారీ విజేతలు..
తరుణ్ తేజ అట్ల(123వ–వరంగల్ అర్బన్), బానోత్ లక్ష్మీ రచన(178–రంగారెడ్డి), ఎం.వెంకటేశ్ ప్రసాద్ సాగర్(358–మహబూబ్నగర్), మెరుగు కౌశిక్(399–మేడ్చల్ మల్కాజ్గిరి), ప్రీతి రాపర్తి(468–మేడ్చల్ మల్కాజ్గిరి), విక్రమ్ బేతి(472–వరంగల్ అర్బన్), ఎస్.యశ్వంత్(475–నల్లగొండ), విక్రమ్ సింహారెడ్డి(541–రంగారెడ్డి), ఆశిష్ అనిశెట్టి(676–వరంగల్ అర్బన్), విజయ సింహా రెడ్డి(682–రంగారెడ్డి), అంగరాజు నవీన్(715–సూర్యాపేట), పుడారి రాహుల్(748–జగిత్యాల), కుమ్మరి శ్రవణ్ కుమార్(768–మెదక్), దాయినంపల్లి ప్రవీణ్(793–ములుగు), ఇస్లావత్ శ్రీ రామ్ హర్ష(823–రంగారెడ్డి), బానోత్ భరత్ కుమార్(900–జనగామ), ప్రత్యూష కట్టా(908–రంగారెడ్డి), జీతేందర్ నాయక్(939–జయశంకర్ భూపాలపల్లి), దీపక్ శర్మ(951–మేడ్చల్ మల్కాజ్గిరి).
సింగరేణి సాయంతో సివిల్స్లో మెరిశారు..
కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులకు, ముఖ్యంగా ప్రిలిమినరీ పరీక్షలో పాస్ అయినవారికి రాజీవ్ సివిల్స్ అభయ హస్తం ద్వారా సింగరేణి సంస్థ లక్ష రూపాయలు ప్రోత్సాహకంగా అందిస్తోంది. 2025 సంవత్సరంలో రాజీవ్ సివిల్స్ అభయ హస్తం ద్వారా 202 మంది అస్పిరెంట్స్ రూ.లక్ష సాయం అందుకోగా, వారిలో 51 మంది అభ్యర్ధులు ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయ్యారు. తుది ఫలితాల్లో(Civil Services 2025) 20 మంది ర్యాంకులు సాధించి విజేతలుగా నిలిచారు. వీళ్లలో సగం మంది వెనుకబడిన వర్గాలకు చెందిన వారు కాగా, నలుగురు ఎస్టీలు, ముగ్గురు ఎస్సీలు ఉన్నారు. సింగరేణి ప్రోత్సాహకం పొందిన వారిలో నలుగురు మహిళలు ఉండగా వీరిలో ముగ్గురికి ఐఏఎస్ వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. మొత్తం మీద సింగరేణి సంస్థ సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులకు ఆర్ధికంగా సహాయం చేస్తూ, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతోందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

