కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Batti Vikramarka) 2026-27 వార్షిక బడ్జెట్ (Telangana Budget) ను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి సర్కార్ 5 కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. అందులో మొదటిది ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం. దీని ద్వారా రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల జీవిత బీమా లభిస్తుంది. . తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నుంచి ఈ కొత్త పథకం అమల్లోకి రానుంది. అటు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు వారానికి మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగిజావతో కూడిన అల్పాహారం అందిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.
అటు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పిస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్ర యువతకు విదేశాలలో ఉపాధి, భాషా నైపుణ్యాలు, వీసా మార్గదర్శకత్వం కోసం సి.ఎం. ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాంను ప్రారంభిస్తామని వివరించారు. దివ్యాంగ విద్యార్థులకు ‘రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్’ వాహనాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం దివ్యాంగుల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం తరపున ఈ వాహనాల పంపిణీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.

