కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే పక్కా సమాచారంతో ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి (MRO Srinivas Reddy)కి చెందిన నివాసాలు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో మొత్తం 15 ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
గతంలో మహేశ్వరం ఎమ్మార్వోగా విధులు నిర్వర్తించిన శ్రీనివాస్ రెడ్డి, ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో సేవలు అందిస్తున్నారు. ఆయన పదవీ కాలంలో అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లతో పాటు కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు విస్తృతంగా సోదాలు చేపట్టి, కీలక పత్రాలు, ఆస్తుల వివరాలను సేకరిస్తున్నాయి. ఈ తనిఖీలకు సంబంధించి పూర్తి వివరాలు, స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువను త్వరలోనే అధికారులు వెల్లడించే అవకాశం ఉంది.

