కలం, వెబ్ డెస్క్ : ఉచిత పథకాలపై సుప్రీం కోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాల అభివృద్ధికి ఈ పథకాలు ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయని కోర్టు తెలిపింది. ముఖ్యంగా భూస్వాములు, సంపన్న వర్గాల వారు కూడా ఉచిత విద్యుత్ వంటి ప్రయోజనాలు పొందుతున్నారని సుప్రీం కోర్టు పేర్కొన్నది. ఈ పథకాల కోసం ఖర్చు చేస్తున్న నిధులన్నీ సామాన్య ప్రజలు కష్టపడి చెల్లించిన పన్నుల సొమ్మేనని, వాటిని ఇలా వృథా చేయడం సరికాదని అభిప్రాయపడింది.
అనేక రాష్ట్రాలు ఇప్పటికే భారీ ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఉచితాలను అమలు చేస్తున్నాయని కోర్టు పేర్కొంది. రాష్ట్రాల ఆదాయం మొత్తం కేవలం ఉద్యోగుల జీతాలకు, ఉచిత పథకాలకే సరిపోతోందని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) వ్యాఖ్యానించారు. దీనివల్ల మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థికాభివృద్ధి కుంటుపడుతోందని పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలు కేవలం నిజమైన అర్హులకు మాత్రమే అందాలని, అనర్హులకు పంపిణీ చేయడం వల్ల ప్రజా ధనం దుర్వినియోగం అవుతోందని తెలిపారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర ప్రతివాదులకు సుప్రీం కోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.


