కలం, స్టేషన్ఘన్పూర్: రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యపై తీసుకొచ్చిన జీవో నెం.97ను వెంటనే రద్దు చేయాలని జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ (Station Ghanpur) పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థులు, అధ్యాపకులు నిరసన చేపట్టారు. ఈ జీవో కారణంగా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవోను పునఃపరిశీలించాలని కోరారు. పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజినీరింగ్ విద్య అభ్యసించకుండా ఈ జీవో అడ్డుకుంటుందన్నారు.
ప్రస్తుతం ఉన్న వ్యవస్థనే కొనసాగించాలని.. మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేశారు. జీవో అమలైతే భవిష్యత్తులో పాలిటెక్నిక్ చదివిన తరువాత ఇంజినీరింగ్లో లేటరల్ ఎంట్రీలో చేరే అవకాశం ఉండదని.. మళ్లీ ఇంటర్ చదవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులు, అధ్యాపకులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీవో రద్దు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

