కలం, జోగుళాంబ గద్వాల: గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను గద్వాల టౌన్ పోలీసులు (Gadwal Police) అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి 5.057 కిలోల గంజాయి, ఒక బైక్, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు గద్వాల డీఎస్పీ వై. మొగులయ్య తెలిపారు. సోమవారం గద్వాల టౌన్ పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు. ఇటిక్యాల మండలం శనిగెపల్లి గ్రామానికి చెందిన బీసన్న, మల్దకల్ మండలం విఠాలపురం గ్రామానికి చెందిన గోకారి గంజాయిని తీసుకుని గద్వాలలో సరఫరా చేసేందుకు వస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారని తెలిపారు.
ఆదివారం సాయంత్రం గద్వాల టౌన్ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు మేలచెర్వు చౌరస్తాలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని తనిఖీ చేయగా వారి వద్ద గంజాయి ప్యాకెట్లు లభించినట్లు డీఎస్పీ తెలిపారు. వారి నుంచి 5.057 కిలోల గంజాయితో పాటు రెండు సెల్ఫోన్లు, ఒక బైక్ను స్వాధీనం చేసుకుని (Ganja Seized) కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఎస్ఐ కళ్యాణ్ కుమార్ దర్యాప్తు చేపట్టగా.. నిందితులు గద్వాల, ఎర్రవల్లి, కొత్తకోట తదితర ప్రాంతాలలో గంజాయి సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు డీఎస్పీ పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, సరఫరాపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గద్వాల సీఐ టి. శ్రీను, ఎస్ఐ కళ్యాణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

