కలం, వెబ్ డెస్క్ : కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని బెంగుళూరు (Bengaluru) రూరల్ పరిధిలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. దేవానహళ్లికి చెందిన శశికళ అనే యువతి వరుసకు తమ్ముడయ్యే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. హోసకోటలో నివసిస్తున్న తన పెద్దమ్మ కుమారుడు ప్రవీణ్తో ఆమె గత మూడేళ్లుగా ప్రేమాయణం సాగిస్తోంది. వీరిద్దరూ సన్నిహిత బంధువులు కావడంతో వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.
ఈ క్రమంలో శశికళ తల్లిదండ్రులు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. తమ ప్రేమను కాపాడుకునేందుకు శశికళ, ప్రవీణ్ ఇళ్ల నుండి పారిపోయి రహస్యంగా వివాహం చేసుకున్నారు. తమ వివాహం వల్ల తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని భావించిన ఈ జంట రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించింది. వరుసకు అక్కాతమ్ములైన వీరు వివాహం చేసుకోవడం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది.

