కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం దావోస్ పర్యటనల్లో 44 ఎంవోయూలు కుదుర్చుకుందని.. దీని ద్వారా రాష్ట్రానికి రాష్ట్రానికి రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి శ్రీధర్బాబు (Sridhar Babu) వెల్లడించారు. ఈ మేరకు గురువారం అసెంబ్లీలో దావోస్ పెట్టుబడులపై ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. పెట్టుబడులతో 68,150 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయని తెలిపారు. 2024 దావోస్లో 18 ఎంవోయూలు రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయని అన్నారు. 2025 దావోస్లో 26 ఎంవోయూలు చేసుకున్నామని.. దీంతో రాష్ట్రానికి రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. రూ.81,800 కోట్ల పెట్టుబడులతో 6 కంపెనీలకు భూముల కేటాయింపు జరిగిందని వివరించారు. దీంతో ప్రభుత్వానికి రూ.1,540 కోట్ల ఆదాయం చేకూరిందని తెలిపారు. రూ.30 వేల కోట్ల పెట్టుబడుల కోసం మరో 3 కంపెనీలకు భూముల గుర్తింపు జరిగిందని చెప్పారు. నిజామాబాద్లో 681 సీట్ల సామర్థ్యంతో ఐటీ టవర్ ను నిర్మించామని తెలిపారు. ఈ టవర్లో 11 కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని.. అందులో ప్రస్తుతం 276 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని వివరించారు. పెట్టుబడుల ఒప్పందాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

