కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మండలం సింగరేణి ప్రాంతానికి చెందిన బానోతు లక్ష్మీ రచన (Lakshmi Rachana) సివిల్ సర్వీస్ పరీక్షల్లో (Civil Services Exam) విజయం సాధించి సత్తా చాటింది. బానోతు వెంకట రమణ, తులసమ్మల కుమార్తె అయిన లక్ష్మీ రచన శుక్రవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 178వ ర్యాంక్ సాధించారు. చిన్నప్పటి నుంచి చదువులో విశేష ప్రతిభ కనబరచిన లక్ష్మీ యూపీఎస్సీ పరీక్షల్లో మాత్రం మూడు సార్లు విఫలమయ్యారు. గతంలో ఒకసారి ఇంటర్వ్యూ వరకూ వెళ్లినా ఆశించిన ఫలితం రాలేదు. అయినప్పటికీ వెనుకడుగు వేయకుండా మొక్కవోని దీక్షతో ప్రయత్నం చేసి 178వ ర్యాంక్ సాధించారు. ఈ ర్యాంక్కు ఐఏఎస్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నట్లు స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి సంస్థ ద్వారా రాజీవ్ సివిల్స్ అభయ హస్తం ప్రోత్సాహకం అందుకొని, సింగరేణి ప్రాంతం నుంచి సివిల్స్ ర్యాంక్ సాధించడం గర్వంగా ఉందని లక్ష్మీ చెప్తున్నారు. ఈమెను స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రాంతం నుంచి మరింత మంది యువత సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి ఉత్సాహం చూపిస్తారని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

