కలం, వెబ్ డెస్క్ : గల్ఫ్ దేశాలకు ఇరాన్ (Iran) క్షమాపణలు చెప్పింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ తన చుట్టూ ఉన్న బహ్రెయిన్, ఖతార్, దుబాయ్, సౌదీ అరేబియా, కువైట్, తుర్కియే, అజార్ బైజాన్ లాంటి దేశాలపై దాడులు చేస్తోంది. ఇరాన్ (Iran) దాడులపై ఆయా దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ తాత్కాళిక అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ.. ‘చుట్టూ ఉన్న దేశాలపై ఇరాన్ దాడులు చేసినందుకు క్షమాపణలు చెబుతున్నా. ఇకపై ఆ దేశాలపై దాడులు చేయొద్దని మధ్యంతర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా దేశాలపై ఎలాంటి క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించం. కానీ ఆ దేశాల నుంచి ఇరాన్ మీద దాడి జరిగితే తిరిగి బలంగా దాడులు చేస్తాం’ అంటూ పెజెష్కియాన్ వెల్లడించారు.
ఇరాన్ మీద దాడులు జరగనంత వరకే తాము ఆయా దేశాలపై దాడులు చేయబోమని పెజెష్కియాన్ స్పష్టం చేశారు. ట్రంప్ చేసిన ప్రకటనపై కూడా పెజెష్కియాన్ స్పందించారు. ఇరాన్ తో ఎలాంటి చర్చలు, ఒప్పందాలు ఉండబోవని.. బేషరుతుగా లొంగిపోవాలంటూ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. పెజెష్కియాన్ మాట్లాడుతూ..’ఇరాన్ ఎవరికీ లొంగిపోదు. మమ్మల్ని లొంగిపోవాలని బెదిరిస్తే.. మీ సమాధుల దాకా యుద్ధాన్ని తీసుకెళ్తాం. అంతేగానీ ఎవరి దగ్గరా తలవంచం’ అంటూ తెలిపారు పెజెష్కియాన్. ఆయన ప్రకటనతో ఇప్పట్లో యుద్ధం ఆగేలా కనిపించట్లేదు.

