కలం, వెబ్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత రోహిత్ శెట్టి(Rohit Shetty) ఇంటిపై ఆదివారం అర్ధరాత్రి తర్వాత గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు చేయడం కలకలం రేపింది. ముంబై(Mumbai)లోని జుహు ప్రాంతంలోని రోహిత్ నివాసంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బైక్ పై వచ్చి ఐదు రౌండ్ల కాల్పులు చేశాడు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన సమయంలో రోహిత్ శెట్టి ఇంట్లో ఉన్నారా? లేదా? అన్నది ఇంకా స్పష్టత రాలేదని అధికారులు చెప్పారు. ఈ దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు వెల్లడించారు. కాల్పులపై సమాచారం అందుకున్న వెంటనే జుహు(Juhu) పోలీస్ స్టేషన్ సిబ్బంది, క్రైమ్ బ్రాంచ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించాయి. కాల్పులు జరిపినవారు ఎవరు, వారి ఉద్దేశం ఏమిటన్న దానిపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. రోహిత్ శెట్టి నివసిస్తున్న జుహు టవర్ చుట్టూ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


