బౌలర్ల వైఫల్యమే కొంపముంచింది.. ఓటమిపై రుతురాజ్ గైక్వాడ్ ఆవేదన!

కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోరు చేసినప్పటికీ ఓటమి పాలవ్వడంపై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించారు. బౌలింగ్ విభాగం ఘోరంగా విఫలం కావడమే తమ ఓటమికి ప్రధాన కారణమని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వరుసగా రెండు ఓటములతో చెన్నై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 209 పరుగుల మెరుగైన స్కోరును బోర్డుపై ఉంచింది. అయితే పంజాబ్ కింగ్స్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ బ్యాటర్లు శ్రేయాస్ అయ్యర్, ప్రియాన్ష్ ఆర్య ధాటిగా ఆడి చెన్నై బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు.

మ్యాచ్ అనంతరం గైక్వాడ్ మాట్లాడుతూ.. తమ జట్టులో ముగ్గురు సీమర్లు, ఇద్దరు నాణ్యమైన రిస్ట్ స్పిన్నర్లు ఉన్నారని పేర్కొన్నారు. పవర్‌ప్లే తర్వాత స్పిన్నర్లు పట్టు బిగిస్తారని భావించినప్పటికీ, అటు పేసర్లు ఇటు స్పిన్నర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారని వివరించారు. ముఖ్యంగా రన్ రేట్ పెరిగిన సమయంలో కీలకమైన ఓవర్లు వేయడంలో బౌలర్లు విఫలమయ్యారని, సరైన సమయంలో వికెట్లు తీయకపోవడం వల్ల మొమెంటం కోల్పోయామని ఆయన అభిప్రాయపడ్డారు. బౌలింగ్‌లో మ్యాట్ హెన్రీ, అన్షుల్ కంబోజ్ తలో రెండు వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. హెన్రీ 13.50 ఎకానమీతో, కంబోజ్ 11.72 ఎకానమీతో పరుగులు ఇచ్చి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>