కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శలు గుప్పించారు. తన చుట్టూ పందికొక్కులు, దోపిడీ దొంగలు ఉన్నారంటూ సొంత కూతురు కవిత లేవనెత్తిన అంశాలకు కేసీఆర్ వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మర మనిషి అయ్యాడని కవిత చెప్పిందని, దీనిపై కేసీఆర్ సమాధానం చెప్తారని అనుకున్నానని రేవంత్ తెలిపారు. కనీసం తన బిడ్డ అడిగిన ప్రశ్నలకైనా ఆయన బదులిస్తేనే ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నట్లు ప్రజలు భావిస్తారని సీఎం పేర్కొన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి బయటకు వస్తేనే రాష్ట్రంలో ఏం జరుగుతుందో వాస్తవాలు తెలుస్తాయని ఎద్దేవా చేశారు.
రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం సాధించారో చెప్పాలని రేవంత్ రెడ్డి నిలదీశారు. బీజేపీతో బీఆర్ఎస్ చీకటి ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపిస్తూ.. కేసులు మాఫీ చేసుకోవడం కోసం పార్టీని విలీనం చేసే ఆలోచనలో ఉన్నట్లు కవితనే స్వయంగా బయటపెట్టారని గుర్తు చేశారు. బీజేపీతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేసీఆర్ తాను నమ్మే దేవుడిపై ప్రమాణం చేసి చెప్పగలరా అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఎంపీలు కావ్య, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారు బీఆర్ఎస్ వైఖరిని గట్టిగా ఖండిస్తున్నా ప్రతిపక్ష నేతలకు వినిపించడం లేదని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు విమర్శలు చేసే వారికి అందరూ తనలాగే కనిపిస్తారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు.

