కలం, వెబ్ డెస్క్: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అక్కడి మీడియాతో చిట్చాట్లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్టాపిక్గా మారాయి. సాధారణంగా 2028లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ 2029లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని రేవంత్రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జాతీయస్థాయి పరిణామాలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో 2029లో ఎన్నికలు జరిగే సూచనలు ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్పడం ఆసక్తికరంగా మారింది.
పార్లమెంటులో జమిలి బిల్లు
వాస్తవానికి ‘ఒకే దేశం - ఒకే ఎన్నిక’ అనే విధంగా జమిలి ఎన్నికల నిర్వహణకు మోదీ సర్కార్ మొగ్గు చూపుతోంది. ఎన్నికల వ్యయాన్ని తగ్గించేందుకు దేశంలో MP, MLA ఎన్నికలు ఒకే దఫాలో ఎన్నిక నిర్వహించే జమిలి ఎన్నికలకు మోదీ కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించి నివేదికను కూడా తీసుకుంది. ఒకే దేశం – ఒకే ఎన్నికకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే ఈ జమిలి ఎన్నికను ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై మోదీ సర్కార్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
జమిలి వస్తే రేవంత్ రెడ్డికి ప్లస్ అవుతుందా?
ఇలాంటి నేపథ్యంలో 2029లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని సీఎం రేవంత్ (Revanth Reddy) చెప్పడం దేశ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశం అవుతోంది. మోదీ సర్కార్ 2029లోనే జమిలి ఎన్నిక నిర్వహణకు సిద్దం అవుతుందా?అనే ఊహగానాలు వెలువడుతున్నాయి. ఇదే గనుక నిజమైతే.. రేవంత్ రెడ్డి సర్కార్కు పాలన పరంగా మరో ఆరు నెలల బోనస్గా వస్తుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, HYDRA వంటి చర్యలు పార్టీకి ప్లస్ అవుతున్నాయని.. మరిన్ని సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ తమ పొలిటికల్ మైలేజ్ను రేవంత్ రెడ్డి సర్కార్ పెంచుకోవచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి జమిలి పరిణామం రేవంత్ రెడ్డి సర్కార్ కు ప్లస్ అవుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో జమిలి ఎన్నికల నిర్వహణ అంశం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తోంది.

