కలం, వెబ్ డెస్క్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. న్యాయ నిపుణుల సూచనల మేరకు ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ సీబీఐ (CBI)కి లేఖ రాయాలని అధికారులను సీఎం రేవంత్ (CM Revanth) అదేశించారు. అవసరమైతే సీబీఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని, నేరుగా కలిసి వినతిపత్రం సమర్పించాలని మంత్రులకు సూచించారు. కాళేశ్వరం అంశంపై ప్రస్తుతం ఏ కోర్టులోనూ ఎలాంటి కేసు పెండింగ్లో లేదని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. అందువల్ల సీబీఐ విచారణ చేపట్టేందుకు చట్టపరమైన అడ్డంకులు లేవని చెప్పారు.
కాళేశ్వరంపై ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సుప్రీం కోర్టు ప్రముఖ న్యాయ నిపుణులు అభిషేక్ సింఘ్వీతో చర్చించి ప్రభుత్వం అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను నిర్దేశించారు. ఈ మీటింగ్ లో సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయ నిపుణులు అభిషేక్ సింఘ్వీ, మంత్రి శ్రీధర్ బాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.ఈ సమావేశంలో రాజ్య సభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, ఇరిగేషన్ ఈఎన్సీ శ్రీధర్, సలహాడారు ఆదిత్య నాథ్ దాస్ పాల్గొన్నారు.

