కలం, స్పోర్ట్స్ : భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) టెస్ట్ క్రికెట్లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నారు. శ్రీలంకతో గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో కేశర నువాంతాను ఔట్ చేయడం ద్వారా జడేజా 350 టెస్ట్ వికెట్ల క్లబ్లోకి చేరారు. ఆగస్టు 17న ఈ ఘనత సాధించారు. ఈ మ్యాచ్కు ముందు జడేజా ఖాతాలో 348 టెస్ట్ వికెట్లు ఉన్నాయి. మరో రెండు వికెట్లు తీస్తే 350 వికెట్ల మైలురాయిని చేరుకునే అవకాశం ఉండగా.. గాలే టెస్టులో ఆ ఘనతను అందుకున్నారు.
4,000 పరుగులు.. 350 వికెట్లు
350 టెస్ట్ వికెట్లతో పాటు 4,000కుపైగా పరుగులు చేసిన నాలుగో క్రికెటర్గా జడేజా నిలిచారు. ఈ జాబితాలో ఇంగ్లండ్ మాజీ ఆల్రౌండర్ ఇయాన్ బోథమ్, భారత దిగ్గజం కపిల్ దేవ్, న్యూజిలాండ్ మాజీ ఆటగాడు డానియల్ వెట్టోరి ఉన్నారు. అదే సమయంలో 350 టెస్ట్ వికెట్లు తీసిన ఐదో భారత బౌలర్గా జడేజా రికార్డు సృష్టించారు. అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్, హర్భజన్ సింగ్ తర్వాత ఈ మైలురాయిని అందుకున్న భారత బౌలర్గా నిలిచారు.
మూడో ఎడమచేతి స్పిన్నర్గా..
350 టెస్ట్ వికెట్లు (350 Test Wickets) సాధించిన మూడో ఎడమచేతి వాటం స్పిన్నర్గా కూడా జడేజా నిలిచారు. శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ రంగనా హెరాత్ 433 వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. డానియల్ వెట్టోరి 362 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు. జడేజా 89 టెస్టులలోనే 350 వికెట్లు సాధించారు. టెస్ట్ క్రికెట్లో ఆయన బౌలింగ్ సగటు 25.12గా ఉంది. ఇప్పటివరకు 15 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశారు.
శ్రీలంకపై జడేజా రికార్డు భేష్
శ్రీలంకపై జడేజాకు మెరుగైన రికార్డు ఉంది. ఆ జట్టుపై ఏడు టెస్టులలో 33 వికెట్లు తీశారు. బ్యాటింగ్లో 326 పరుగులు సాధించారు. గాలే టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ను 460/9 వద్ద డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో ఆకట్టుకోగా.. ధ్రువ్ జురెల్ 54 పరుగులు చేశారు. గాయం తర్వాత జడేజాకు భారత టెస్ట్ జట్టులో ఇదే తొలి మ్యాచ్.
గాయం తర్వాత పునరాగమనం
ఐపీఎల్ 2026 సమయంలో టెన్నిస్ ఎల్బో గాయానికి గురైన జడేజా మే నుంచి క్రికెట్కు దూరంగా ఉన్నారు. జనవరి 2026 తర్వాత భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడటం కూడా ఇదే తొలిసారి. పునరాగమన మ్యాచ్లోనే 350 వికెట్ల మైలురాయిని చేరుకోవడం జడేజా కెరీర్లో మరో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. శ్రీలంకతో రెండో టెస్ట్ ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో జరగనుంది. ఈ మ్యాచ్లోనూ జడేజా నుంచి మరో అద్భుత ప్రదర్శనపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

