కల్యాణలక్ష్మి పథకం కొనసాగించాలని చండూరులో ధర్నా

కలం, మునుగోడు (చండూరు): కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను కొనసాగించాలని చండూరు (Chandur) మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ పథకాలపై కోర్టు స్టే విధిస్తుంటే, ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ఏం చేస్తున్నారని నిలదీశారు.

కేసీఆర్‌ను తిట్టడం తప్ప సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని మండిపడ్డారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కేసీఆర్‌ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టి పదేళ్లు అమలు చేసిందన్నారు. హైకోర్టులో సరైన వాదనలు వినిపించకపోవడంతో పథకంపై ఆంక్షలు విధించే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.

తులం బంగారం ఇవ్వాలి..

కల్యాణ లక్ష్మి పథకాన్ని యథావిధిగా కొనసాగించడంతో పాటు ఎన్నికల హామీ మేరకు తులం బంగారం కూడా ఇవ్వాలని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి డిమాండ్‌ చేశారు. మహిళలకు నెలకు రూ.2,500, రైతులకు ఎకరాకు రూ.15 వేల సాయం అమలు చేయాలన్నారు. రైతు బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో రైతులకు సాగునీరు, ఎరువులు అందించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. మాటలతో, ఎదురుదాడులతో ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోలేదని హెచ్చరించారు. నిరసనలో చండూరు, మర్రిగూడ, నాంపల్లి, మునుగోడు, గట్టుప్పల మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>