కలం, మెదక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 25 నుండి జరిగే SIR కార్యక్రమంపై తెలంగాణ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని బీజేపీ పార్టీ అధ్యక్షుడు రామచందర్ రావు (Ramachander Rao) విమర్శించారు. ప్రతి పది సంవత్సరాలకు ఒక సారి SIR ప్రక్రియ జరగాల్సి ఉందని, దీన్ని బీజేపీ చేస్తున్న కుట్రగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నయని అన్నారు. సిద్దిపేట (Siddipet) జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కుకునూరుపల్లి మండలం మాతపల్లిలోని బీజేపీ జిల్లా ప్రశిక్షణా తరగతులలో రామచందర్ రావ్, మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ.. ఓటర్ల ప్రక్షాళన అనేది ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ప్రక్రియ అని, చనిపోయిన, స్థలం మారిన, దొంగ ఓట్ల ప్రక్షాళన కోసం ప్రభుత్వం SIR నిర్వహిస్తుందన్నారు. గత ప్రభుత్వాలు SIR నిర్వహించినప్పుడు బీజేపీ మద్దతు ఇచ్చింది. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు బీజేపీపై బురద జల్లే పని చేస్తున్నాయని మండిపడ్డారు. కేరళ ప్రాంతంలో SIR జరిగింది. తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలలో జరుగుతుంది. బీజేపీ గెలిస్తే ఈవీఎం వల్ల అంటారు, మీరు గెలిచిన రాష్ట్రాలలో ఈవీఎంలు లేవా అని ప్రశ్నించారు. SIR పై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వైఖరి ఒకటేనని, బీజేపీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా పెరుగుతుందని అన్నారు. బీజేపీని ప్రజలు నమ్ముతున్నారని ధీమా వ్యక్తం చేశారు.

