కలం, వెబ్ డెస్క్: బీజేపీ కార్యకర్తలు నిర్ణయించుకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్చందర్ రావు (Ramchander Rao)హెచ్చరించారు. మహబూబ్నగర్ జిల్లాలో శనివారం జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ పై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయన్నారు. “వారిని సరిహద్దు దాటనివ్వను” వంటి భాషను ఉపయోగించడం సీఎం రేవంత్ రెడ్డి స్థాయికి ఏమాత్రం తగదని సూచించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఏమిచ్చింది అనే అంశంపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తేదీ, సమయం నిర్ణయిస్తే సచివాలయం గేటు వద్దకైనా వచ్చి చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ముందుగా, ఆ చర్చకు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు.
నష్టపరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలి..
రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామానికి చెందిన రైతుల ప్రతినిధి బృందం (Koheda Farmers) బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రామ్చందర్ రావును కలిశారు. ప్రతిపాదిత కొత్త ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ కోసం ప్రభుత్వం బలవంతంగా భూ సేకరణ చేపడుతున్నదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామ్ చందర్ రావు మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా ఈ భూములను సాగు చేసుకుంటున్న రైతులను సరైన నష్టపరిహారం ఇవ్వకుండా పక్కన పెట్టడం తీవ్ర అన్యాయమని అన్నారు. రైతుల సమస్యలను వినకుండా, ప్రభుత్వం ఎర్త్మూవర్లతో నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లడం వల్ల అక్కడ ఉద్రిక్తతలు, ఘర్షణలు, అరెస్టులు చోటుచేసుకున్నాయని మండిపడ్డారు.
కోహెడ రైతులకు బీజేపీ సంపూర్ణంగా అండగా నిలుస్తుందని చెప్పారు. రైతు సంక్షేమం గురించి మాట్లాడే ప్రభుత్వం.. రైతులకు న్యాయం చేయకుండా వారి భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని ఎలా సమర్థించగలదో సమాధానం చెప్పాలని రామ్చందర్ రావు (Ramchander Rao) డిమాండ్ చేశారు. రైతులకు పూర్తి స్థాయిలో న్యాయమైన నష్టపరిహారం చెల్లించిన తర్వాత మాత్రమే ఫ్రూట్ మార్కెట్ నిర్మాణ పనులు చేపట్టాలని బీజేపీ స్పష్టంగా డిమాండ్ చేస్తోందన్నారు.
సీఎం రాకముందే రైతుల అరెస్టులు..
కోహెడలో రేవంత్ రెడ్డి (CM Revanth) ప్రతిపాదిత ఫ్రూట్ మార్కెట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని.. అయితే ఈ భూములు రైతులకు చెందినవని చెప్పారు. రైతుల భూములను సేకరించి, ఇప్పటివరకు సరైన నష్టపరిహారంగా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా బలవంతంగా స్వాధీనం చేసుకోవడం ద్వారా ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. నిన్న ముఖ్యమంత్రి కార్యక్రమానికి రాకముందే, ఆ ప్రాంతానికి చెందిన రైతులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారని చెప్పారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత సాయంత్రం మాత్రమే వారిని విడుదల చేశారని అన్నారు.
Read Also: ఇకపై బైక్ హ్యాండిల్ వదిలేస్తే దబిడి దిబిడే
Follow Us On: X(Twitter)

