కలం, కరీంనగర్ బ్యూరో: ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో మహిళా, శిశు సంక్షేమ, కార్మిక, పోలీస్ శాఖలు, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సమన్వయంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి గీతా భవన్ చౌరస్తా వరకు కొనసాగిన ఈ ర్యాలీని జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా కార్మిక శాఖ అధికారి ప్రసాద్ ప్రారంభించారు. వివిధ దుకాణాలు, వాణిజ్య సంస్థల వద్దకు వెళ్లి బాల కార్మికులు పనిచేస్తున్నారా.. అనేది తనిఖీలు చేశారు. బాల కార్మికులు లేని దుకాణాల యజమానులను అభినందించి “బాల కార్మికుల రహిత దుకాణం” స్టిక్కర్లు అంటించారు. బాల కార్మికులు కనిపిస్తే వెంటనే ఛైల్డ్ హెల్ప్ లైన్ 1098 కు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి సభ్యులు రేండ్ల కళింగ శేఖర్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ప్రతినిధి చంద్రప్రకాశ్ రెడ్డి, సీడీపీఓలు, ఛైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కో ఆర్డినేటర్ సంపత్, బాలల పరిరక్షణ సిబ్బంది శాంత, తిరుపతి, సాధినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు.

